సూర్యాపేట : హుజుర్నగర్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభను రద్దు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హుజుర్నగర్ ఉప ఎన్నికలో భాగంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిబాబా థియేటర్ రోడ్డులో బహిరంగ సభ కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ ఆ సభకు వెళ్లాల్సి ఉంది. అక్కడ గంటన్నర సేపటి నుంచి వర్షం కురుస్తుండడంతో హెలికాప్టర్లో వెళ్లేందుకు సీఎం కేసీఆర్కు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. వాన పడుతున్నందున హుజుర్నగర్ వెళ్లడం కష్టమని పైలట్లు సూచించిన మేరకు హెలికాప్టర్ పర్యటనను రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ప్రకటించారు. హుజుర్నగర్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
హుజుర్నగర్లో వర్షం.. సీఎం కేసీఆర్ సభ రద్దు..